నిజాం సర్కార్


హైదరాబాదు రాజ్యము యొక్క పాలకుల పట్టము నిజాం ఉల్ ముల్క్ లేదా నిజాం. నిజాముని ఇప్పటికీ ఆలా హజ్రత్ అని, నిజాం సర్కార్ అని సంబోధిస్తారు. వీరి వంశము వారు1724 నుండి 1948 వరకు హైదరాబాదును పరిపాలించారు.

నిజాం నవాబులు:

 నాసిర్ జంగ్ మీర్ అహ్మద్ (1748-1750)
మొహియుద్దీన్ ముజఫ్ఫర్ జంగ్ హిదాయత్ (1750-1751)
ఆసిఫ్ ఉద్దౌలా మీర్ అలీ సలాబత్ జంగ్ (1751-1762)
నిజాం అలీ ఖాన్ అసఫ్ ఝా II (1762-1802)
మీర్ అక్బర్ అలీ ఖాన్ అసఫ్ ఝా III (1802-1829)
నాసిర్ ఉద్దౌలా ఫర్ఖుందా అలీ అసఫ్ ఝా IV (1829-1857)
అఫ్జల్ ఉద్దౌలా మహబూబ్ అలీ ఖాన్ అసఫ్ ఝా V (1857-1869)
ఫతే జంగ్ మహబూబ్ అలీ ఖాన్ అసఫ్ ఝా VI (1869-1911)
ఫతే జంగ్ నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అసఫ్ ఝా VII (1911-1949)



నాసిర్ జంగ్ మీర్ అహ్మద్ (1748-1750):

నాసిర్ జంగ్ మీర్ అహ్మద్ హైదరాబాద్ రాజ్యానికి పరిపాలకుడు. ఆయన నిజాం-ఉల్-ముల్క్ రెండవ కుమారుడు. 91 సంవత్సరాల వయసులో తన తండ్రి మరణించాకా జరిగిన వారసత్వ పోరాటాల్లో పాల్గొని తక్తును ఎక్కారు. క్రీ.శ.1748 నుంచి 1750 వరకు హైదరాబాద్ రాజ్యాన్ని పరిపాలించారు.

వారసత్వ యుద్ధం
నిజాం-ఉల్-ముల్క్ మరణించాకా హైదరాబాద్ రాజ్యాన్ని చేజిక్కించుకునేందుకు బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ సాయం తీసుకుని తన మేనల్లుడు ముజఫర్ జంగ్ తో సంఘర్షణ పడ్డారు. ఫ్రెంచి వారి మద్దతుతో సంఘర్షించిన ముజఫర్ జంగ్ ను నాసిర్ జంగ్ ఓడించి బందీని చేశారు.

మరణం
1748లో గెలిచి పరిపాలన చేపట్టినా రెండు సంవత్సరాలు తిరిగేసరికల్లా హత్యకు గురై మరణించారు.


ఆసిఫ్ ఉద్దౌలా మీర్ అలీ సలాబత్ జంగ్ (1751-1762):

అసఫ్‌ ఉద్దౌలా మీర్ అలీ సలాబత్ జంగ్ (జ: 1718 - మ: సెప్టెంబరు 16, 1763) హైదరాబాదు నిజాం పాలకుడు. 1751 సంవత్సరంలో ముజఫర్ జంగ్ హత్య తరువాత ఫ్రెంచి సేనాని బుస్సీ నాసర్ జంగ్ తమ్ముడైన సలాబత్ జంగ్ ను దక్కను సుబేదారుగా ప్రకటించాడు. సలాబత్ జంగ్ దివానైన సయ్యద్ లస్కర్ ఖాన్ దక్కను నుండి ఫ్రెంచి సేనలను తరిమివేయడానికి కుట్రపన్నాడని పసిగట్టిన బుస్సీ 1754లో ఉత్తర సర్కారులైన శ్రీకాకుళం, ఏలూరు, రాజమహేంద్రవరం, కొండపల్లి లను సొంత జాగీరుగా సలాబత్ జంగ్ చేత వ్రాయించుకున్నాడు.

సారవంతమైన ఉత్తర సర్కారులు ఫ్రెంచి వారి ఆధీనంలోకి పోవటం వలన హైదరాబాదు రాజ్య ఆర్ధిక పరిస్థితి విచ్ఛిన్నమైనది. సలాబత్ జంగ్ ప్రజల అభిమానం కోల్పోయాడు. మూడవ కర్ణాటక యుద్ధం లో ఆంగ్లేయులు ఫ్రెంచి వారిని ఓడించి మచిలీపట్నం స్వాధీనం చేసుకున్నారు. 1759 మే 14 తేదీన సలాబత్ జంగ్ ఆంగ్లేయులతో సంథి చేసుకొని గుంటూరు తప్ప ఉత్తర సర్కారు లన్నింటిని ఆంగ్లేయుల పరం చేశాడు.

క్రీ.శ. 1761లో మొదటి అసఫ్ జా నాలుగవ కుమారుడైన నిజాం ఆలీ ఖాన్ రెండవ అసఫ్ జా బిరుదుతో నిజాం అయ్యాడు. ఇతని కాలం నుండే అసఫ్ జాహీ ప్రభువులు నిజాం ప్రభువులుగా ప్రసిద్ధిచెందారు.

మీర్ అక్బర్ అలీ ఖాన్ అసఫ్ ఝా III (1802-1829)

సికిందర్ జా (జ: 11 నవంబర్ 1768 - మ: 21 మే, 1829) మూడవ నిజాం గా హైదరాబాదు ను 1803 నుండి 1829 వరకు పరిపాలించెను.

ఇతడు రెండవ నిజాం రెండవ అసఫ్ జా కు రెండవ కుమారునిగా జన్మించాడు.

ఇతని కాలంలోనే బ్రిటిష్ ప్రభుత్వం హైదరాబాదులో కంటోన్ మెంట్ ను స్థాపించినది. ఈ ప్రాంతాన్ని నిజాం జ్ఞాపకార్థం సికింద్రాబాదు అని పేరుపెట్టారు. ఈ కాలంలోనే రెండవ మహారాష్ట్ర యుద్ధం కూడా జరిగింది.

క్రీ.శ.1804 లో అజీం ఉల్ ఉమర్ మరణించడంతో బ్రిటిష్ వారి అభీష్టానుసారంగా మీర్ ఆలం ను దివానుగా నియమించాడు. హైదరాబాదులోని మీర్ ఆలం చెరువు ఈతని పేరుమీద నిర్మించబడినది. క్రీ.శ. 1808 మీర్ ఆలం మరణించడంతో అతని అల్లుడైన మునీర్ ఉల్ ముల్క్ ను దివానుగా నియమించాడు.

క్రీ.శ. 1811 లో హైదరాబాదులో బ్రిటిష్ ప్రతినిధిగా నియమించబడిన హెన్రీ రస్సెల్ శాంతి భద్రతలను కాపాడటానికి రస్సెల్ దళము ను తయారుచేశాడు. ఈ దళమే తరువాత కాలంలో హైదరాబాదు సైన్యంగా ప్రసిద్ధిచెందినది. ఈ సైన్యం క్రీ.శ. 1817లో జరిగిన పిండారీ యుద్ధం లోనూ, క్రీ.శ. 1818 లో జరిగిన మహారాష్ట్ర యుద్ధం లోనూ పాల్గొన్నది.


అఫ్జల్ ఉద్దౌలా మహబూబ్ అలీ ఖాన్ అసఫ్ ఝా V (1857-1869):

అఫ్జల్ ఉద్దౌలా (11 అక్టోబర్ 1827 - 26 ఫిబ్రవరి 1869) నాసిర్ ఉద్దౌలా కుమారుడు నిజాం పరిపాలకులలో ఐదవ అసఫ్ జా. ఇతడు హైదరాబాదు ను క్రీ.శ. 1857 నుండి 1869 వరకు పరిపాలించెను.

సిపాయిల తిరుగుబాటు:
ఈతని పరిపాలన కాలంలోనే సిపాయిల తిరుగుబాటు జరిగినది. హైదరాబాదులో బ్రిటిష్ రెసిడెన్సీపై దాడి చేసిన తురాబజ్ ఖాన్ ను బ్రిటిష్ వారు కాల్చి చంపారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ముస్లిం ప్రజలను రెచ్చగొడుతున్న అల్లాఉద్దీన్ మౌల్వీని బంధించి అండమాన్ దీవులకు పంపారు.

ఈ తిరుగుబాటు సమయంలో నిజాం మరియు సాలార్ జంగ్ లు కంపెనీకి పూర్తి సహకారం అందించి బ్రిటిష్ వారికి తోడ్పడినందుకు ప్రతిఫలంగా షోలాపూర్ ను తిరిగి నిజాంకు స్వాధీనం చేశారు. నిజాం కంపెనీకి చెల్లించవలసిన 50 లక్షల రూపాయలు రద్దుచేశారు. బ్రిటిష్ వారు నిజాంకు "స్టార్ ఆఫ్ ఇండియా" అనే బిరుదును ఇచ్చి సత్కరించారు.


ఫతే జంగ్ మహబూబ్ అలీ ఖాన్ అసఫ్ ఝా VI (1869-1911):

మహబూబ్ ఆలీఖాన్ హైదరాబాదును పరిపాలించిన అసఫ్‌జాహీ వంశపు ఆరవ నవాబు. ఈయన 1869 నుండి 1911 వరకు హైదరాబాదు రాజ్యాన్ని పరిపాలించాడు.
అఫ్జల్ ఉద్దౌలా క్రీ.శ. 1869 లో మరణించగా అతని మూడేళ్ళ వయసు గల కుమారుడు మహబూబ్ ఆలీ ఖాన్ ఆరవ అసఫ్ జా గా రాజ్యానికి వచ్చాడు. ఇతనికి సంరక్షకులుగా సాలార్ జంగ్ మరియు అమీర్ ఎ కబీర్ లను బ్రిటిష్ ప్రభుత్వం నియమించింది. పరిపాలనా దక్షుడైన సాలార్ జంగ్ తన పాలనా సంస్కరణలను కొనసాగించి క్రీ.శ. 1883 ఫిబ్రవరి 8వ తేదీన మరణించాడు. రాష్ట్ర పరిపాలన అస్తవ్యస్తమై ముల్కీ ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. అందువలన బ్రిటిష్ వారు సాలార్ జంగ్ కుమారుడైన మీర్ లాయిక్ ఆలీ ఖాన్ మరియు రాజా నరేంద్ర బహదూర్ ను సంయుక్త పాలకులుగా నియమించింది.

మీర్ మహబూబ్ ఆలీ ఖాన్ మేజర్ కావడం వలన 1884, ఫిబ్రవరి 5 తేదీన బ్రిటిష్ వైస్రాయ్ అయిన లార్డు రిప్పన్ స్వయంగా వచ్చి నిజాంకు అధికార లాంఛనాలు అందజేశాడు. అదే రోజు మీర్ లాయిక్ ఆలీ ఖాన్ రెండవ సాలార్ జంగ్ బిరుదుతో దివాన్ గా నియమించబడ్డాడు.
ఇతడు రాజభాషగా పర్షియన్ భాష స్థానంలో ఉర్దూ భాషను ప్రవేశపెట్టాడు. ఇతని పాలనలోనే చంద్రపూర్ నుండి విజయవాడకు బ్రిటిష్ వారితో ఒప్పందం జరిగి రైలు మార్గం నిర్మించబడినది.

ఇతడు పరమత సహనము కలిగినవాడుగానూ, కళా పోషకుడుగానూ పేరుపొందినవాడు. పేదసాదల నిత్యపోషకుడిగా ప్రసిద్దుడు.


ఫతే జంగ్ నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అసఫ్ ఝా VII (1911-1949):

ఉస్మాన్ ఆలీ ఖాన్ (1886 - 1967) మహబూబ్ ఆలీ ఖాన్ రెండవ కుమారుడు. క్రీ.శ. 1911లో నిజాం మరణించడంతో ఇతడు ఏడవ అసఫ్ జా బిరుదుతో నైజాం పదవిని అలంకరించాడు. ఈయనే అసఫ్ జాహీ పాలకులలో చివరివాడు. ఇతడి పూర్తి పేరు " ఫతే జంగ్ నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అసఫ్ ఝా VII " ఇతడు ఏప్రిల్ 6, 1886లో హైదరాబాదులోని పురానీ హవేలీ లో జన్మించాడు.

టైమ్ పత్రిక 1937 సంవత్సరం నిజాం ను ప్రపంచంలోని అత్యంత ధనవంతునిగా ప్రచురించింది.

ఆగష్టు 15, 1947న భారతదేశం స్వాతంత్ర్యం అనంతరం హైదరాబాదును స్వతంత్ర రాజ్యం చేయడానికి నిజాం ప్రయత్నించాడు. నిజాం తో అనేక సంప్రదింపులు జరిపిన భారత ప్రభుత్వం చివరకు సెప్టెంబరు 13, 1948న ఆపరేషన్ పోలో పేరుతో సైనిక చర్య జరిపి హైదరాబాదు సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసింది. 1956లో జరిగిన భాషాప్రయుక్త రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ వలన నిజాం రాజ ప్రముఖ్ పదవి కోల్పోయాడు.

ఇతడు 1957 మరియు 1962 సార్వత్రిక ఎన్నికలలో అనంతపురం మరియు కర్నూలు నియోజకవర్గాల నుండి భారత పార్లమెంటుకు రెండు సార్లు ఎన్నికయ్యారు.
ఇతడు 1967 సంవత్సరం ఫిబ్రవరి 24 తేదీన మరణించాడు.

హైదరాబాదులో చేపట్టిన అభివృద్ధి పనులు

డెక్కన్ క్వీన్, నిజాం రాజ్య రోడ్డు రవాణా సంస్థకు చెందిన 1932నాటి బస్సు(విజయవాడ బస్సు కాంప్లెక్స్ ఆవరణలో ప్రదర్శితమవుతోంది.
ఉస్మాన్ సాగర్, నిజాం సాగర్ మరియు హిమాయత్ సాగర్ సరస్సులు నిర్మించడినవి.
ఉస్మానియా విశ్వవిద్యాలయం 1917 సంవత్సరంలో స్థాపించబడినది.
సిర్పూరు పేపరు మిల్స్, బోధన్ చక్కెర ఫాక్టరీ, అజంజాహీ నూలు మిల్లులు, చార్మినార్ సిగరెట్ ఫాక్టరీ మొదలైన కర్మాగారాలు నెలకొల్పబడినవి.
నిజాం స్టేట్ రైల్వే నెలకొల్పబడినది.



No comments:

Post a Comment