కాకతీయులు

కాకతీయ వంశము ప్రస్తుత [ తెలంగాణ] రాష్ట్ర ప్రాంతమును క్రీ. శ. 1083 నుండి క్రీ. శ. 1323 వరకు పరిపాలించిన రాజవంశము. క్రీ. శ. 9వ శతాబ్దము ప్రాంతములో రాష్ట్రకూటుల సేనానులుగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన కాకతీయులు ఆంధ్రదేశాన్ని అంతటిని ఒకే త్రాటిపైకి తెచ్చి పరిపాలించారు . శాతవాహనుల అనంతరం ఆంధ్రదేశాన్ని, జాతినీ సమైక్యం చేసి, ఏకచ్ఛత్రాధిత్యం క్రిందికి తెచ్చిన హైందవ రాజవంశీయులు కాకతీయులొక్కరే. కాకతీయుల కాలంలోనే ఆంధ్ర, త్రిలింగ పదాలు సమానార్థకాలై, దేశపరంగా, జాతిపరంగా ప్రచారం పొందాయి. వీరు ఆంధ్రదేశాధీశ్వర బిరుదు ధరించారు.
వీరి రాజధాని ఓరుగల్లు (నేటి వరంగల్లు).


పూర్వ రంగం:


తెలంగాణ ప్రాంతంలో కాకతీయుల రాజ్యానికి అంకురార్పణ జరుగుతున్నపుడు తీరాంధ్రంలో వేంగి, చాళుక్య, చోళుల ప్రాభవం క్షీణదశలో ఉంది. ప్రారంభంలో తూర్పు చాళుక్యులు పశ్చిమ (బాదామి) చాళుక్యులకు సోదర సమానులు. కాని క్రమంగా దక్షిణాపథం నుండి విస్తరిస్తున్న చోళులు తీరాంధ్రాన్ని తమ అధీనంలోకి తెచ్చుకోవడానికి తూర్పు చాళుక్యులతో సంబంధాలు కలుపుకొన్నారు. ఆలా క్రీ. శ. 1076నుండి తీరాంధ్రంలో చాళుక్య చోళ యుగం ప్రారంభమై క్రీ. శ. 1200 వరకు సాగింది. వారికి, సత్యదేవుని నాయకత్వంలోని పశ్చిమ చాళుక్యులకు తరచు యుద్ధాలు జరిగాయి. దక్షిణ తీరాంధ్రంలో 11, 12 శతాబ్దాలలో వెలనాటి చోడులు, గుంటూరు జిల్లా ప్రాంతంలో చోళులకు సామంతులుగా ఉంటూ పశ్చిమ చాళుక్యులను ఎదుర్కొన్నారు. క్రీ. శ. 1135లో వేంగిలో జరిగిన యుద్ధంలో గొంకయ అనే వెలనాటి చోళ నాయకుని సైన్యం చేత పశ్చిమ చాళుక్యులు తీవ్రంగా పరాజితులై ఆంధ్ర ప్రాంతంనుండి పూర్తిగా వైదొలగారు. తరువాత వెలనాటి చోళులు దక్షిణ తీరాంధ్రంలో దాదాపు స్వతంత్రులుగా పాలించారు.

తరువాత ఈ ప్రాంతాన్ని అంచెలంచెలుగా కొణిదెన చోళులు, నెల్లూరు చోడులు పాలించారు. కడప ప్రాంతాన్ని రేనాటి చోళులు, కోనసీమను హైహయ రాజులు, నిడదవోలును వేంగి చాళుక్య చోళులు, కొల్లేరు ప్రాంతాన్ని తెలుగు నాయకులు, విజయవాడను చాగివారు, ధరణికోటను కోటవారు, కొండవీడును నాయకులు, పల్నాటిని హైహయ వంశపు రాజులు పాలిస్తుండేవారు. ఈ చిన్న చిన్న రాజ్యాల మధ్య తగాదాలు వైషమ్యాలు సర్వ సాధారణం. క్రీ. శ. 1176-1182 మధ్యకాలంలో కారంపూడి వద్ద జరిగిన పల్నాటి యుద్ధం అప్పటి మత సాంప్రదాయాల మధ్య (శైవులు, వైష్ణవులు), కులాల మధ్య, జ్ఞాతుల మధ్య (నలగామరాజు, మలిదేవరాజు) జరిగిన పెద్ద పోరు. దాదాపు అందరు రాజులూ ఈ యుద్ధంలో ఏదో ఒక పక్షంలో పాలు పంచుకొన్నారు. ఇందులో జరిగిన అపారమైన జన, ఆస్తి నష్టం వల్ల తీరాంధ్ర రాజ్యాలన్నీ శక్తిహీనములయ్యాయి. సమాజం కకావికలయ్యింది. బలం కలిగిన పాలకులు లేకపోతే జరిగే కష్టం ప్రజలకు అవగతమయ్యింది. అరాచకాన్ని అంతం చేసే ప్రభువులకు అది అదనైన సమయం. ఈ పరిస్థితిలో ఓరుగల్లు కాకతీయులకు రాజులందరినీ ఓడించడం అంత కష్టం కాలేదు. ఆంధ్ర దేశాన్ని తమ పాలనలో ఐక్యం చేసే అవకాశం వారికి లభించింది.

తెలంగాణా ప్రాంతం ఆ సమయంలో స్వతంత్ర రాజుల పాలనలో లేదు. కొన్ని భాగాలు పశ్చిమ చాళుక్యుల అధీనంలోను, కొన్ని భాగాలు రాష్ట్రకూటుల అధీనంలోను, కొన్ని భాగాలు వేంగి చాళుక్యుల అధీనంలోను ఉన్న సామంతరాజుల పాలనలో ఉండేవి. ముఖ్యంగా వేంగి చాళుక్యులకు, రాష్ట్రకూటులకు మధ్య ఎడ తెరపి లేకుండా అనేక యుద్ధాలు జరిగాయి. తెలంగాణా లోని వివిధ ప్రాంతాలు పాలకుల మధ్యలో చేతులు మారుతుండేవి. ఇలా దాదాపు ఐదు వందల యేండ్లు తెలంగాణలో స్వతంత్ర రాజ్యం లేనందున అక్కడ ఆర్ధిక, సాంస్కృతిక ప్రగతి కుంటువడింది.

క్రీ. శ. 950 - 1100 మధ్య కాలంలో కాకతీయుల పూర్వీకులు రాష్ట్రకూటులకు, లేదా పశ్చిమ చాళుక్యులకు లేదా తూర్పు చాళుక్యులకు (దశలను బట్టి) సామంతులుగా, ఉద్యోగులుగా ఉండేవారు. క్రీ. శ. 934-945 మధ్య మధిర, మానుకోటలను పాలించిన కాకత్య గుండన రాష్ట్రకూటులకు ప్రతినిధి. రాష్ట్రకూటులకు, వేంగి రాజులకు మధ్య జరిగిన యుద్ధాలలో ప్రశంసనీయమైన పాత్ర వహించి, తన ప్రభువు ప్రోత్సాహంతో రాజ్యాన్ని ఏర్పరచుకొన్నాడు. అతని వంశస్తులు ప్రోలరాజు, బేతరాజు, రెండవ ప్రోలరాజు క్రమంగా తెలంగాణా ప్రాంతంలో పశ్చిమ చాళుక్యుల పాలనను అంతమొందించ గలిగారు. తరువాత కాకతీయుల పాలన తీరాంధ్రానికి విస్తరించింది.


కాకతీయుల పుట్టుపూర్వోత్తరాలు:

కాకతీయుల పుట్టుపూర్వోత్తరాలు వివాదాస్పదము. వీరునూ చాళుక్యుల వలెనే కర్ణాట దేశమునకు చెందినవారని ఒక అభిప్రాయము.  క్రీ.శ. 950లో తూర్పు చాళుక్య రాజు వేయించిన దానార్ణవుని మాగల్లు శాసనం ప్రకారం "గుండియ రాష్ట్రకూటుని ప్రపౌత్రుడు కాకత్య గుండ్యన". (గుండియ కొడుకు ఎరియ రాష్ట్రకూటుడు. అతని కొడుకు బేతియ. అతని కొడుకు కాకత్య గుండన). ఈ "రాష్ట్రకూట" పదం ఆధారంగాను, రాష్ట్రకూటుల గరుడ లాంఛానాన్ని ధరించినందువల్ల కాకతీయులు మహారాష్ట్రములోని నాందేడు ప్రాంతంనుండి వచ్చి, తెలంగాణ ప్రాంతంలో రాజోద్యోగులుగా స్థిరపడ్డారని చరిత్రకారుడు పరబ్రహ్మశాస్త్రి అభిప్రాయ పడ్డాడు. రాష్ట్రకూటులు తాము సూర్య వంశస్తులమని చెప్పుకోగా కాకతీయులు "అత్యర్కేందు కులం" వారని చెప్పబడింది. అనగా కాకతీయులు శూద్రులు అని.  కాకతీయులది కొన్ని తెలుగు నాయక వంశాల మాదిరి దుర్జయ వంశము  అని చెప్పబడింది.

చిలుకూరి వీరభద్రరావు తన ఆంధ్ర చరిత్ర లో వడ్డమాని శాసనం, బూదవూరు శాసనం, ఒక రెడ్డి వనిత వేయించిన అనితల్లి శాసనం, యనమదల శాసనం, త్రిపురాంతక శాసనం ఆధారంగా చేసుకొని కాకతీయులు శూద్ర కులానికి చెందినవారు అని చెప్పడానికి ప్రయత్నించారు. ఈ రచనను వెల్లాల సదాశివ శాస్త్రులు, రుద్రరాజు నరసింహరాజు, వంగూరి సుబ్బారావు వంటి పెక్కు మంది రచయితలు విమర్శించారు.

శ్రీ మాన్ పరవస్తు వెంకటాచార్యులు "శ్రీ మన్మహాపరిచ్చేదక వర్ణాట కోట కాకతీ వంశ పాటవముల వసిష్ట కౌండిన్య వర ధనంజయ కాస్యపాఖ్య గోత్రంబుల నతిశయిల్లు" అని వ్రాశారు. ఇందులో కాకతీయులు కాస్యప గోత్రీకులని తెలుస్తోంది. వీరి వంశ ప్రవర - 'కుశపుండరీక కరికాల చోళ మహారాజ ప్రవరాన్విత కాకతీయ ప్రోలరాజ వంశ' అని బుద్ధరాజు వరహాలరాజు "శ్రీ ఆంధ్ర క్షత్రియ వంశ రత్నాకరము' లో వ్రాయబడియున్నది.

దూర్జయాన్వ సంభూతుడైన ఎర్రన యు అతని భార్యయైన కామసాని యు బేతరాజును కాకతి వల్లభు చేశారని గూడూరు శాసనంలో వ్ర్రాయబడి ఉన్నది. ప్రతాపరుద్రుని సమకాలికుడైన విద్యానాధుడు "ఆత్యర్కేందు కులప శస్తి మసృజద్యం కాకతీయాన్వయమ్" అని కాకతీయాన్వయము సూర్య చంద్ర వంశములను అతిశయించినదని చెప్పాడు. గుంటూరు జిల్లా మల్కాపురంలో శిధిలావస్థలో ఉన్న ఒక దేవాలయంలో నంది విగ్రహం పై ఒక శాసనం  కాకతీయులు సూర్యవంశపు క్షత్రియులని తెలుపుచున్నది. గణపతిదేవుని శాసనం, కాకతీయ కులగురువగు శివదేవముని శాసనం, గణపతిదేవుని దండనాధుని శాసనం మొదలైన శాసనాలు కాకతీయులు ఆంధ్ర క్షత్రియులని తెలుపుచున్నవి.


చేబ్రోలు శాశనం ప్రకారం గణపతిదేవుడు మున్నూరు సీమ (కృష్ణా జిల్లా) ప్రాంతంలోని కాపు / కమ్మ కులానికి చెందిన జయప నాయుడి(జాయప్ప సేనాని) సోదరిలైన నారమ్మ, పేరమ్మలను వివాహమాడాడు. వీరి కుమార్తెలు రుద్రమదేవి, జ్ఞానాంబ. గణపతిదేవుడు తన పెద్ద కుమార్తె రుద్రమదేవిని చాళుక్య వంశీయుడైన గణపతిదేవరాజు కిచ్చి వివాహం చేశాడు. రెండవ కుమార్తె జ్ఞానాంబ ను ధరణికోట రాజు కోటపెద్దిరాజు కిచ్చి వివాహం చేశాడు. వీరి కుమారుడే కాకతీయ ప్రతాపరుద్రుడు.

మూడు దశలు

కాకతీయ సామ్రాజ్యంలో మూడు ముఖ్యమైన ఘట్టాలున్నాయి.

క్రీ. శ. 1000- 1158 - తెలంగాణ విమోచన: ఈ దశలో నలుగురు రాజులు పాలించారు - కాకత్య గుండన, మొదటి ప్రోలరాజు, రెండవ బేతరాజు మరియు రెండవ ప్రోలరాజు - ఈ సమయంలో తెలంగాణ ప్రాంతం కాకతీయుల వశమయ్యింది. తెలుగునాట పశ్చిమ చాళుక్యుల పాలన అంతమయ్యింది. ముఖ్యంగా రెండవ ప్రోలరాజు పెద్ద రాజ్యాలకు ప్రతినిధులైన నలుగురు సామంతులను ఓడించి ఈ నిజయం సాధించాడు. అంతకు ముందు తీరాంధ్రంలో మాత్రమే స్వతంత్ర రాజ్యాలున్నాయి. కన్నడ ప్రాంతపు చాళుక్యులు, మహారాష్ట్రము నుండి రాష్ట్రకూటులు తీరాంధ్రంపై జరిగిన దండయాత్రలకు తెలంగాణా మార్గంగా ఉంది. కనుక తెలంగాణ ప్రాంతంలో ఆర్ధిక, సాంస్కృతిక ప్రగతి కుంటువడింది. ప్రజలలో పుట్టి, కష్టసుఖాలెరిగిన కాకతీయులు సాధించిన స్వాతంత్ర్యముతో తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయం, సాహిత్యం, వ్యాపారం ఊపందుకొన్నాయి. ఇప్పటికీ కాకతీయులు త్రవ్వించిన చెరువులే చాలా మండలాలలో ముఖ్య నీటివనరులు.

    క్రీ. శ. 1159 - 1261 తీరాంధ్రంలో విజయం : ఈ దశలో కాకతీయులు ఉత్తరాన గంజాం నుండి దక్షిణాన కంచి వరకు జయించారు. రాయలసీమ, తెలంగాణ మరియు తీరాంధ్ర ప్రాంతాలు ఒకే పాలనలోకి వచ్చాయి. ఈ దశలో ముగ్గురు పాలకులున్నారు. వారిలో గణపతి దేవుడు ప్రసిద్ధుడు. ఈ కాలంలో అన్ని ప్రాంతాల వారి మధ్య సంబంధ బాంధవ్యాలు పెరిగాయి.

    ఖ్రీ. శ. 1262 - 1323 సామ్రాజ్య పతనం: ఈ సమయంలో రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు పాలించారు. ఇద్దరూ సమర్థులైన ప్రభువులు మరియు యుద్ధ కోవిదులు. కాని ఉప్పెనలా ముంచుకొచ్చిన ముస్లిం దండయాత్రల కారణంగా కాకతీయ సామ్రాజ్యం పతనాన్ని ఆపలేకపోయారు. వివిధ కులాల మధ్య కలహాలు ఈ పతనానికి మరింత తోడ్పడ్డాయి.


కాకతీయ పాలకులు:

కాకతి వెన్నయ :750-768
మొదటి గుండయ :769-824
రెండవ గుండయ :825-870
మూడవ గుండయ :870-895
ఎఱ్ఱయ :896-925
మొదటి బేతరాజు :946-955
నాల్గవ గుండయ :956-995
గరుడ బేతరాజు :996-1051
మొదటి ప్రోలరాజు :1052-1076
రెండవ బేతరాజు :1076-1108
దుర్గరాజు :1108-1115
రెండవ ప్రోలరాజు :1116-1157
గణపతి దేవుడు :1199-1262
రుద్రమ దేవి:1262-1289
ప్రతాపరుద్రుడు :1289-1323


ఆరంభ దశ:

క్రీ. శ. 934-945 మధ్యకాలంలో గుండయ రాష్ట్రకూటుల ప్రతినిధి (సామంత రాజు) గా మధిర, మానుకోట తాలూకాలను పాలించేవాడు. అది రాష్ట్రకూట రాజయిన రెండవ కృష్ణునకు, వేంగి రాజు మొదటి చాళుక్య భీమునకు యుద్ధాలు జరుగుతున్న సమయం. అనంతరం పెరువంగూరు యుద్ధంలో గుండయ మరణించాడు. బెజవాడను పట్టుకోవడంలో గుండన చూపిన సాహసానికి కృతజ్ఞతాపూర్వకముగా రెండవ కృష్ణుడు గుండయ కుమారుడు ఎరియను ఓరుగల్లు దగ్గరలోని కురవాడికి అధిపతిగా చేశాడు. తూర్పుననున్న ముదిగొండ చాళుక్యులను నివారించుటకు ఇది ఉపయోగపడింది. ఎరియ ఓరుగల్లు (కాకతీపురము)ను రాజధానిగా చేసుకొని పరిపాలన చేశాడు. ఇతని మనుమడు కాకత్య గుండ్యన (ఎరియ కొడుకు బేతన కాలంలో బహుశా మళ్ళీ కురవాడిని చాళుక్యులు ఆక్రమించి ఉండవచ్చును).

దానార్ణవునికి, ఆతని సోదరుడు రెండవ అమ్మరాజునకు జరిగిన ఘర్షణలో, మూడవ కృష్ణుని ప్రోద్బలముతో, దానార్ణవుడు వేంగీ సింహాసనము చేజిక్కించుకొనుటకు గుండ్యన సాయపడ్డాడు. ఆ రాజ్యాలలో చెలరేగిన కల్లోలాలను అదునుగా తీసికొని, మళ్ళీ కురవాడిని తన అధీనంలోకి తెచ్చుకొని ఉండవచ్చును. అయితే ముదిగొండ చాళుక్యులకు చెందిన "విరియాల ఎర్ర భూపతి" ఒక యుద్ధంలో గుండ్యనను వధించాడు. గుండ్యన కొడుకు గరుడ బేతన చిన్న వయసులో రాజ్యం కోల్పోయి నిస్సహాయుడైనాడు. ఎర్ర భూపతి భార్య కామసాని ఆ పిల్లవానిపై జాలిగొని ఓరుగల్లు రాజ్యం ఇప్పించింది. ముందు రాష్ట్రకూటుల సామంతులుగా ఉన్న కాకతీయులు ఇలా విరియాల వారి సౌహార్ద్రత్వంతో చాళుక్యుల సామంతులుగా ఓరుగల్లులో నెలకొన్నారు. బేతన క్రీ. శ. 1052 వరకు రాజ్యం చేశాడు.


మొదటి బేతరాజు (946-955)


ఎఱయ రాష్ట్రకూటుని కుమారుడు బేతియ...ఇతను అసమర్థుడు....దీనివలన కుఱవాడిని ముదిగొండ చాళుక్యులు తిరిగి ఆక్రమించారు...బేతియ కుమారుడు కాకర్త్య గుండ్యన కాలానికి వేంగిలో కలహాలు ఆరంభమయ్యాయి...


నాల్గవ గుండయ:(956-995)

బేతియ కుమారుడు కాకర్త్య గుండ్యన కాలానికి వేంగిలో కలహాలు ఆరంభమయ్యాయి...చాళుక్య దానార్ణవుడు రాష్ట్రకూటుల తోడ్పాటుతో తమ్ముడు రెండో అమ్మరాజును తొలగించి వేంగిని స్వాధీనం చేసుకున్నాడు...దానార్ణవునికి తోడ్పడిన గుండ్యన నతవాడి ( నేటి వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని ప్రాంతం ) కి పాలకుడయ్యాడు. 973 లో జరిగిన అలజడుల్లో రాష్ట్రకూటవంశం అంతరించింది.రెండో తైలపుడు చాళుక్య వంశాన్ని తిరిగి ప్రతిష్టించాడు. వేంగిలో జటాచోడభీముడుదానార్ణవుని చంపి సింహాసనాన్ని ఆక్రమించాడు.ఇదేఅవకాశంగా గుండ్యన కుఱవాడిని కైవసం చేసుకున్నాడు.అయితే పశ్చిమ చాళుక్యసేనాని విరియాల ఎఱన సాయంతో ముదిగొండ చాళుక్య బొట్టు బేతడు గుండ్యనను చంపి 900 ప్రాంతాలలో రాజ్యం ఆక్రమించుకున్నాడు


గరుడ బేతరాజు(996-1051):

గుండ్యన చనిపోయేనాటికి అతని కొడుకు బేతరాజు పిన్నవాడు.. అతని మేనత్త కామసాని అండగా వుండి, తన భర్త ఐన చాళుక్య సేనాని ఎర్రన ద్వారా చాళుక్య చక్రవర్తి చేత బేతనికి అనుమకొండ విషయాధిపత్యం ఇప్పించింది. ఈవిధంగా కాకతీయులు కళ్యాణి చాళుక్యులకు విధేయ సామంతులుగా అనుమకొండ విషయాధినేతలయ్యారు.
మొదటి బేతరాజు 1051 వరకు జీవించి వున్నట్టు, అనగా 50 సంవత్సరాలకు పైగా ఏలాడని, శాసనాలు తెల్పుతున్నాయి. ..
ఇతని సేనాని రేచర్ల బ్రహ్మ చాళుక్య త్రైలోక్య సోమేశ్వరుని తరపున చోళరాజధాని కంచి పై దాడి చేశాడు

మొదటి ప్రోలరాజు(1052-1076):


మొదటి బేతరాజు కుమారుడు మొదటి ప్రోలరాజు. ఖాజీపేట, పిల్లల మర్రి, పాలంపేట శాసనాలు ఇతని ఘనకార్యాలను పేర్కొంటున్నాయి.మొదటి ప్రోలరాజు తన సార్వభౌముడైన మొదటి సోమేశ్వరుని దండయాత్రలలో పాల్గొన్నాడు. సోమేశ్వరుడు ఇతని శౌర్యప్రతాపాలకు మెచ్చి అతనికి అనుమకొండను వంశపారంపర్యపు హక్కులను ఇచ్చి సామంత ప్రభువుగా గుర్తించాడు.ఇతడు తన రాజ్యానికి పొరుగున ఉన్న వేములవాడ, కార్పర్తి, గుణసాగరం మొదలైన ప్రాంతాలను జయించాడు. భద్రంగుని సబ్బి మండలాన్ని ఆక్రమించాడు.మొదటి ప్రోలరాజు ఓరుగల్లు సమీపంలో అరిగజకేసరి పేరుతో పెద్ద చెరువును తవ్వించాడు. ప్రస్తుతం దీనిని కేసరి సముద్రంగా పరిగణిస్తున్నారు.




రెండవ బేతరాజు(1076-1108):

ప్రోలుని అనంతరం అతని కొడుకు రెండవ బేతరాజు 1076లో అనుమకొండ రాజ్యాధిపతి అయ్యాడు.
చాళుక్య రాజ అంతరకలహాలలో ఇతను విక్రమాదిత్యుని సమర్థించి ఆతని ఆదరానికి పాత్రుడైనాడు. మంత్రి వైజదండనాయకుని రాజనీతి తో సబ్బిమండలం చాలావరకు రాజ్యంలో కలుపుకున్నాడు.
రెండవ బేతరాజు కాలముఖ శైవాచార్యుడు రామేశ్వర పండితుని నుండి శైవదీక్ష పొంది గురుదక్షిణగా అనుమకొండలో శివపురమనే భాగాన్ని,
అందులో బేతేశ్వరాలయాన్ని నిర్మించాడు ఇతని బిరుదులు ' విక్రమచక్ర ', ' త్రిభువనమల్ల ' .
బేతని మరణాంతరం అతని పెద్దకొడుకు దుర్గరాజు ఎనిమిది సంవత్సరాలు పాలించాడు.


దుర్గరాజు(1108-1115):


రెండో బేతరాజు మరణాంతరము అతని కుమారుడు దుర్గరాజు 8 సంవత్సరాలు పాలించాడు...
ఇతని బిరుదు ' త్రిభువనమల్ల దేవ ' ..అని కాజీపేట శాసనము తెలుపుతోంది.
అయితే ఇప్పటిదాకా ఇతని పరిపాలనా విశేషాలు తెలియరాకున్నవి...


రెండవ ప్రోలరాజు(1116-1157):

రెండవ ప్రోలరాజు దుర్గరాజు తమ్ముడు మరియు రెండవ బేతరాజు కుమారుడు.
కళ్యాణీ చాళుక్య వంశంలో ఆరవ విక్రమాదిత్యుని తరువాత రాజులు అంతగా సమర్ధులు కారు. అందువలన సామంత రాజులు అనేకులు స్వతంత్రులుగా ప్రకటించుకున్నారు. రెండవ ప్రోలరాజు ఇదే సమయంలో వారి రాజ్యాలపై దండెత్తి ఓడించి తన రాజ్యాన్ని విస్తరించాడు. ఈ విషయాలను హనుమకొండ శాసనం పేర్కొంటుంది.


గణపతి దేవుడు:

కాకతీయ రాజులలో గొప్ప చక్రవర్తి గణపతి దేవుడు. 6 దశాబ్దాల పాటు కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. తెలుగు నాటిని ఏకము చేసి తెలుగు వారందరినీ ఒక గొడుగు క్రిందకి తెచ్చిన మహనీయులలొ కాకతీయ గణపతిదేవుడు ఒకడు (మిగిలిన వారు గౌతమీపుత్ర శాతకర్ణి, ముసునూరి కాపానీడు, శ్రీకృష్ణదేవరాయలు).

దేవగిరి ఏలుతున్న యాదవ రాజు జైత్రపాలుడు 1195 లో కాకతీయ రుద్రదేవుని వధించి గణపతిదేవుని బంధిస్తాడు. రుద్రదేవుని తమ్ముడు మహాదేవుడు ఓరుగల్లు సింహాసనమెక్కి మూడు వర్షములు (1196-1198 CE) పాలిస్తాడు. 1198లో గణపతిని విడిపించుటకు దేవగిరిపై దండెత్తి విజయము సాధిస్తాడు కాని తన ప్రాణాలు కోల్పోతాడు. మహాదేవుని మరణానంతరము రాజ్యములో అరాచకము చెలరేగుతుంది. మహాదేవుని కుమారుడైన గణపతిదేవుడు 1198లో రాజ్యానికి వస్తాడు.సేనాధిపతి రేచెర్ల రుద్రుడు తన శక్త్తియుక్తులు ధారపోసి రాజ్యము చక్కదిద్దుతాడు. గణపతిదేవుడు పాలించిన 62 సంవత్సరములు తెలుగు దేశ చరిత్రలో కొనియాడదగినవి. ఇతని పాలనలో రాజ్యవిస్తరణకు, వర్తకానికి ప్రాముఖ్యతనిచ్చాడు.

పాలనా విధానం:
కాకతీయ గణపతిదేవుడు రాజ్యానికి రాకముందు 12 సంవత్సరాలు దేవగిరి యాదవుల వద్ద బందీగా ఉన్నాడు. ఈ కాలంలో సామతరాజులు ఎన్నో తిరుగుబాట్లు చేశారు. ఈ తిరుగుబాట్లను సేనాని రేచర్ల రుద్రుడు అణచివేశాడు. విడుదలైన పిదప రేచర్ల రుద్రుడు కాకతీయ రాజ్యాన్ని గణపతిదేవుడికి అప్పగించాడు. గణపతిదేవుని పాలనలో వ్యవసాయము మరియు వర్తకాలు బాగా వృద్ధిచెందాయి. గణపతిదేవుడు వర్తకులకు ప్రాత్సహించాడు. మోటుపల్లిలో వేయించిన అభయశాసనం దీనికి నిదర్శనం. గణపతిదేవుడు కాకతీయ రాజధానిని హన్మకొండ నుండి ఓరుగల్లుకు మార్చినాడు. వ్యవసాయము వృద్ధిచెందడానికి నీటిపారుదల కల్పించుటకు ఇతని సేనాని పాకాల చెరువును కట్టించాడు. మరో సేనాని గౌండ సముద్రాన్ని నిర్మించాడు.

రాజ్యవిస్తరణ:
తీరాంధ్రవిజయము:
గణపతిదేవుడు రాజ్యవిస్తరణకు ప్రాధాన్యత ఇచ్చాడు. ఇందుకోసం సైనిక బలంపైనే కాకుండా సరిహద్దు రాజ్యాల రాజకుటుంబాలతో సంబంధాలుపెట్టుకున్నాడు. 1201లో జరిగిన మొదటి దండయాత్ర లో బెజవాడ స్వాధీనము చేసుకున్నాడు. అటునుండి దివిసీమకు మరలాడు. అచట అయ్య వంశమునకు చెందిన పినచోడి పాలిస్తున్నాడు. తీవ్ర ప్రతిఘటన అనంతరము పినచోడి లొంగిపోయాడు. పినచోడి కూతుళ్ళు నారమ్మ, పేరమ్మలను గణపతి వివాహమాడి, కొడుకు జాయప సేనాని ని కాకతీయ గజసైన్యాధికారిగా నియమిస్తాడు. దీనితో వెలనాడు కాకతీయ రాజ్యములో కలిసిపోయింది. 1209 ఇడుపులపాడు (బాపట్ల తాలూకా) శాసనము ప్రకారము కమ్మనాడు, వెలనాడు ఈ దండయాత్రలో జయించబడ్డాయి. 1212లో తూర్పు తీరంపై దండయాత్ర చేసి కృష్ణా, గోదావరి గుంటూరులను స్వాధీనం చేసుకున్నాడు.నిడదవోలును పాలిస్తున్న వేంగీచాళుక్య రాజు వీరభద్రుడికి తన కూతురు రుద్రమదేవినిచ్చి వివాహం చేశాడు. మరో కూతురు గణపాంబను ధరణికోట రాజు బేతరాజుకు ఇచ్చి వివాహం జరిపించాడు. . నెల్లూరును జయించి మనుమసిద్ధికి ఇచ్చాడు. దాదాపు రాయలసీమ మొత్తం గణపతిదేవుని పాలనలోకి వచ్చింది. శాతవాహనుల అనంతరం తెలుగు ప్రాంతాన్నంతటినీ ఏకఛత్రాధిపత్యంలోకి తెచ్చినాడు. గణపతి దేవునికి కుమారులు లేనందున ఇతని అనంతరం కూతురు రుద్రమదేవి అధికారంలోకి వచ్చింది.

దక్షిణదేశ దండయాత్ర:
నెల్లూరు, కడప, చెంగల్ పట్టు ప్రాంతములకు తమ్ముసిద్ది రాజు. ఇతడు మనుమసిద్ద్గి మూడవ కొడుకు. తన అన్నలు తిక్క, నల్లసిద్ధి లను నిర్వీర్యులను చేసి పాలించుతుండగా తిక్కభూపాలుడు తమ్ముసిద్ధిని గద్దె దించుటకు గణపతిదేవుని ఆశ్రయించుతాడు. గణపతి నెల్లూరు రాజ్యమును జయించి తిక్కభూపాలునకు అప్పగించి వెడలుతాడు. జాయప నాయుడు 1213లో వేయించిన చేబ్రోలు శాసనములో ఈ వివరాలున్నాయి. తదుపరి జరిగిన గణపతిదేవుని యుద్ధములలో తిక్క పలుమార్లు చేయందిస్తాడు. కంచి చోళులను, కడప వద్ద సేవణులను, కళింగులను ఓడించుటలో తిక్క హస్తమున్నది.

వర్తకము:
రాజ్యములో వ్యవసాయము ముఖ్య వృత్తి ఐననూ దేశవిదేశములతో వాణిజ్యము ఎన్నోవిధముల అభివృద్ధి చెందింది. మోటుపల్లి, మసులీపట్టణం ముఖ్యమైన ఓడ రేవులు. ఛైనా నుండి పట్టు వస్త్రములు దిగుమతి అయ్యేవి. మోటుపల్లి నుండి వజ్రాలు, దంతము, ముత్యాలు రోం నగరము వరకు ఎగుమతి చేయబడేవి. కాకతీయ సామ్రాజ్యములో వజ్రాలు సేకరించు విధి విధానాలు మార్కో పోలో చాలా వివరముగా వ్రాశాడు[6]. మసులీపట్టణమునుండి విలువైన మస్లిన్ వస్త్రాలు, అద్దకము చేయబడిన వస్త్రాలు, ఓరుగల్లులో నేయబడిన తివాచీలు, ఉన్నిదుస్తులు ఎగుమతి అయ్యేవి. కూనసముద్రము దగ్గరలోని నిర్మల నుండి ఇనుప ఖనిజము, సముద్ర తీర ప్రాంతములో చేయబడిన ఉప్పు కూడ ఎగుమతి అయ్యేవి.

గణపతిదేవుని శాసనాలు:
మోటూపల్లి అభయ శాసనం

రాజ్య పాలన:
గణపతి దేవుడు కాకతీయ సామ్రాజ్యాన్ని 20 సంవత్సరాలపాటూ సుభిక్షంగా పరిపాలించాడు. రాజ్య వారసుడి కోసం పరితపించిన గణపతిదేవుడికి తన భార్య వల్ల రుద్రమదేవి, గణపాంబ అను ఇద్దరు కుమార్తెలు కలిగారు. ఫలితం లేకపోవడంతో తన సైన్యంలో దూర్జయ అను శూద్ర తెగకు చెందిన సైన్యాధ్యక్షుడు జయపసేనాని యొక్క చెల్లెళ్ళు నారమ్మ , పేరమ్మలను వివాహమాడాడు. 1262 లో రాజ్య భారాన్ని రుద్రమదేవికి అప్పగించాడు.



రుద్రమ దేవి:

రుద్రమదేవి కాకతీయుల వంశంలో ఒక ధ్రువతారగా వెలిగిన మహారాణి. కాకతీయ వంశమునకు గొప్ప పేరు ప్రఖ్యాతులని తెచ్చిపెట్టిన వీరవనిత. భారతదేశ చరిత్రలో రాజ్యాలను ఏలిన మహారాణులలో రుద్రమదేవి ఒకరు. ఈమె అసలు పేరు రుద్రాంబ. ఈమె తండ్రి గణపతిదేవునికి పుత్ర సంతానం లేదు. అందువలన రుద్రాంబను తన కుమారుడిలా పెంచుకొని రుద్రదేవుడని నామకరణం చేసాడు. గణపతిదేవుడు తన కుమర్తె రుద్రమదేవిని నిరవద్యపుర (నిడదవోలు )ప్రాంతాన్ని పాలిస్తున్న తూర్పు చాళుక్యుడైన వీరభద్రుడికి ఇచ్చి వివాహం చేశాడు. రుద్రమదేవికి ఇద్దరు కుమార్తెలు. పెద్దకుమార్తె ముమ్మడమ్మ. ఈమె మహాదేవుని భార్య. వీరి పుత్రుడే ప్రతాప రుద్రుడు. రుద్రమాంబ ప్రతాపరుద్రుని దత్తత తీసుకొని యువరాజుగా పట్టాభిషేకం చేసింది. ప్రతాపరుద్రునకు అన్నమదేవుడు అనే తమ్ముడు ఉండేవాడని స్థానిక గాథ. బస్తర్ రాజ్య చివరి పాలక వంశంవారు అన్నమదేవుని తమ వంశకర్తగా చెప్పుకున్నారు. రుద్రమదేవి రెండవ కుమార్తె రుయ్యమ్మను ఇందులూరి అన్నలదేవునికిచ్చి వివాహం చేసింది. అన్నలదేవుడు సేనాపతి మరియు మహా ప్రధాని.

జీవిత విశేషాలు:
కాకతీయులలో అగ్రగణ్యుడైన గణపతిదేవుని తరువాత 1262 లో రుద్రమదేవి ' రుద్రమహారాజు ' బిరుదంతో కాకతీయ మహాసామ్రాజ్య సింహాసనాన్ని అధిష్టించింది. అయితే ఒక మహిళ పాలకురాలు కావటం ఓర్వలేని అనేకమంది సామంతులు తిరుగుబాటు చేసారు. అదేసమయంలో నెల్లూరు పాండ్యుల కింద, వేంగి ప్రాంతం గొంకరాజు మొదటి నరసింహుడి కిందకి వెల్లినయి...పాకనాటి కాయస్థ అంబదేవుడు, కళింగ నరసింహుని కుమారుడు వీరభానుడు తిరుగుబాట్లు చేసారు. రుద్రమ తన సేనానులతో కలిసి ఈ తిరుగుబాట్లనన్నిటినీ విజయవంతంగా అణచివేసింది. రుద్రమాంబ ఎదుర్కొన్న దండయాత్రలన్నిటిలోకీ దేవగిరి యాదవరాజుల దండయాత్ర అతి పెద్దది, కీలకమైనది. యాదవరాజు మహాదేవుడు ఓరుగల్లును ముట్టడించాడు, అయితే రుద్రమ యాదవలను ఓడించి, దేవగిరి దుర్గం వరకూ తరిమి కొట్టింది. వేరేదారి లేని మహదేవుడు సంధికి దిగివచ్చి, యుద్ధ పరిహారంగా మూడుకోట్ల సువర్ణాలు చెల్లించాడు. రుద్రమదేవి యొక్క శైవమత గురువు విశ్వేశ్వర శివశంబు. గణపతి దేవునికి, రెండవ ప్రతాపరుద్రునికి కూడా ఈయనే గురువు.

రుద్రమ తానే స్వయంగా కాయస్త రాజ్యంపై దాడి చేసినట్లు తెలుస్తోంది.  కాయస్త అంబదేవునితో జరిగిన యుద్ధాలలోనే మరణిచినట్లు చరిత్రకారులు భావిస్తున్నారు.

రుద్రమదేవికి గల ఇతర బిరుదులు: రాయగజకేసరి, ఘటోదృతి.

ప్రఖ్యాత పథికుడు మార్కో పోలో ఛైనా దేశమునుండి తిరిగివెళ్ళుతూ దక్షిణభారత దేశము సందర్శించి రుద్రమదేవి గురించి, ఆమె పాలన గురించి బహువిధముల పొగిడాడు. మోటుపల్లి రేవునుండి కాకతీయుల సముద్ర వ్యాపారము గురించి కూడ వివరముగా వ్రాశాడు


ప్రతాపరుద్రుడు(1289-1323):

ప్రతాపరుద్రుడు కాకతీయ రాజవంశమునకు చెందిన చివరి రాజు. ప్రతాపరుద్రుడు రుద్రమదేవి మనవడు (కూతురు కొడుకు). రుద్రమదేవి ఈయన్ను వారసునిగా చేసుకోవటానికి దత్తత తీసుకొంది. ప్రతాపరుద్రునికి మొదట వీరరుద్రుడు, కుమారరుద్రుడను పేర్లుండెను. జినకళ్యాణాభ్యుదయమను రచనను ముగించుచూ గ్రంథకర్త అప్పయార్యుడు తన్న గ్రంథమును రుద్రకుమారదేవుని రాజ్యములో శకము 1241లో ముగించితినని చెప్పుకున్నాడు.

1289లో కాయస్థ సేనాని అంబదేవుని తిరుగుబాటు అణచు ప్రయత్నములో రుద్రమదేవి మరణించింది. ప్రతాపరుద్రుడు సింహాసనమధిష్ఠించాడు. ప్రతాపరుద్రుని పరిపాలనాకాలమంతయూ యుద్ధములతోనే గడచింది.

రాజ్యము:
రాజ్యాన్ని విస్తరించి రాజ్యపాలనలో పెక్కు సంస్కరణలు చేశాడు. ఈతని కాలములో వ్రాయబడిన "సరస్వతీ విలాసము" అను గ్రంథములో హిందూ ధర్మములు, ఆచారములు, ఆస్తి హక్కులు మొదలగు చట్టములు క్రోడీకరించబడినవి . పెక్కు గ్రామాలకు నీటి వసతి కొరకు చెఱువులు తవ్వించాడు. వీటిలో బయ్యారము చెరువు ప్రసిద్ధమైనది

యుధ్ధములు:
క్రీ. శ. 1289లో రుద్రమ దేవి మరణానంతరము రాజ్యాధికారము చేబట్టిన వెంటనే అంబదేవుని తిరుగుబాటు అణచివేయుటకు ప్రతాపరుద్రుడు పూనుకున్నాడు. అందుకోసం నాయంకారవిధానమును కట్టుదిట్టం చేశాడు. నాయకుల సైన్యమునంతనూ తీర్చిదిద్ది మంచి శిక్షణ ఇప్పించి సిద్ధపరిచాడు. తన దాడిని మూడుగా విభజించి మూడు మార్గములలో నడిపించాడు. ఒకటి అంబదేవుని పైకి, రెండవది నెల్లూరు పైకి, మూడవది సేవుణ రాజ్యము పైకి. ఇందులూరి అన్నయ త్రిపురాంతకముపై దాడిచేసి క్రీ. శ. 1291లో అంబదేవుని తరిమివేశాడు. ఆడిదము మల్లు నెల్లూరు పైకి వెడలి అచట మనుమగండభూపాలుని హతమార్చాడు. పశ్చిమరంగములో గోన గన్నయ, విటలుడు యాదవరాజాక్రాంతములైనున్న ఆదవాని, తుంబళము కోటలు పట్టుకొని రాయచూరుదుర్గముపై దాడికి వెడలారు. కన్నడప్రాంతాలైన మాణువ, హాళువలను కూడ సాధించి కృష్ణా తుంగభద్రల నడిమిదేశమంతటినీ జయించారు. దీనితో సేవుణ రాజు దురాక్రమణము కట్టుబడింది. ఆంతరంగిక వ్యవహారాలీవిధముగా చక్కదిద్దుకొనగలిగినను ప్రతాపరుద్రునికి గొప్ప విపత్కరపరిస్థితి ఉత్తరదేశము నుండి ముంచుకొచ్చింది.

ముస్లిం దండయాత్రలు:
ఢిల్లీ సుల్తాను జలాలుద్దీను అల్లుడు గరషాస్ప్ మాలిక్ క్రీ.శ. 1296లో యాదవరాజ్యముపై దండెత్తి దేవగిరిని దోచుకుపోయాడు. గరషాస్ప్ మామను హత్యచేసి అల్లావుద్దీన్ ఖిల్జీ అను పేరుతో సింహాసనమెక్కాడు. సిరిసంపదలతో తులతూగుతున్న ఓరుగంటిపై ఖిల్జీ కన్ను బడింది. తెలుగుదేశముపై ముస్లిముల దాడులకు క్రీ.శ. 1303లో అంకురార్పణ జరిగింది.

మొదటి దాడి:
అల్లావుద్దీను ఖిల్జీ తన విశ్వాసపాత్రులైన సర్దారులు మాలిక్ ఫక్రుద్దీన్ జునా మరియు జాజు లను గొప్ప సైన్యముతో బంగాళదేశము మీదుగా పంపాడు. కాకతీయ నాయకుడు పోతుగంటి మైలి ఉప్పరపల్లి (ప్రస్తుత కరీంనగర్ మండలం)వద్ద తురుష్క సైన్యాన్ని ఎదుర్కొని తరిమివేశాడు.

రెండవ దాడి:
క్రీ.శ. 1309లో సుల్తాను మరింత సైన్యముతో మాలిక్ నాయిబ్ కాఫూర్ ను పంపాడు. అతడు దేవగిరిమీదుగా పయనించి దారిలో సిరిపూరు కోటను స్వాధీనము చేసుకుంటాడు. విషయము తెలిసి ప్రతాపరుద్రుడు సైన్యమును సిద్ధముచేసి కోట సంరక్షణకు సన్నిద్ధుడవుతాడు. కాఫూర్ హనుమకొండను ఆక్రమించి ఓరుగల్లు ముట్టడించాడు. బురుజునకొక నాయకుని చొప్పున తగు సైన్యముతో నెలరోజులు వీరోచితముగా కోటను కాపాడారు. తుదకు ముస్లిం సేనలు మట్టిగోడను చుట్టిఉన్న అగడ్తను దాటి లోపలికి ప్రవేశించగలిగాయి. ప్రతాపరుద్రుడు రాతికోటను సురక్షితముగా కాపాడగలిగాడు. విసిగి వేసారిన కాఫూర్ ఓరుగంటి పరిసరప్రాంతం, గ్రామాలు భస్మీపటలం చేసాడు. అమాయక ప్రజలను, ఆడువారిని, పిల్లలను, ముసలివారు అని కూడ చూడకుండ నరసంహారం చేశాడు. సైనికులు స్త్రీలపై అత్యాచారాలు చేశారు. ఇది తెలిసి ప్రతాపరుద్రుడు సంధికి ఒప్పుకొని అపారమైన ధనమును, ఏనుగులను బహూకరించాడు.

మూడవ దాడి:
క్రీ. శ. 1318లో సుల్తాను పేరిట సర్వాధికారము వహించి పాలన చేస్తున్న మాలిక్ కాఫుర్ ను హత్య చేసి అల్లావుద్దీన్ కొడుకు కుతుబుద్దీన్ ముబారక్ సింహాసనమాక్రమించాడు. దక్కన్ వ్యవహారములు చక్కబెట్టడానికి ముబారక్ స్వయంగా దేవగిరి మీదుగా ఓరుగల్లు వస్తాడు. ఆతని దురాగతముల గురించి విన్న ప్రతాపరుద్రుడు ధనకనకవస్తువాహనాలిచ్చి పంపుతాడు.

నాలుగవ దాడి:
క్రీ. శ. 1320లో ఢిల్లీ రాజకీయాలలో పెద్ద మార్పు వచ్చింది. ఖిల్జీ వంశం పోయి తుగ్లక్ వంశం అధికారములోకి వచ్చింది. ఘియాజుద్దీన్ తుగ్లక్ సుల్తానయ్యడు. ఇది అదనుగా చూసి ప్రతాపరుద్రుడు వార్షిక కప్పం ఆపివేస్తాడు. లోగడ సుల్తానుకప్పగించిన బీదర్ కోట మరల ఆక్రమిస్తాడు. కోపగించిన ఘియాజుద్దీన్ తన కొడుకు ఉలుఘ్ ఖానును ఓరుగల్లుపై దండయాత్రకు పంపుతాడు. దారిలోగల బీదర్, కోటగిరి లోబరుచుకొని ఓరుగల్లు కోట ముట్టడించాడు. ఎంత ప్రయత్నించినా కోట స్వాధీనము కాలేదు. అయిదు నెలల ముట్టడి తర్వాత విఫలుడైన ఉలుఘ్ ఖాన్ ఢిల్లీ మరలి పోయాడు. చరిత్రకారులు ఈ విషయముపై పలువిధాలుగా వ్రాశారు. కాని ప్రతాపరుద్రుని నాయకుల, సేనల ధైర్యసాహసములకు, పోరాట పటిమకు ఇది ఒక మచ్చుతునక.


అయిదవ దాడి:
ఇక ఉపద్రవములుండవని భావించిన ప్రతాపరుద్రుడు యుద్ధములో జరిగిన నష్ఠాలను పూడ్చుకొనక ఉపేక్షించాడు. కొటకు మరమ్మతులు చేయించలేదు. సామగ్రి సమకూర్చుకొనలేదు. నెలరోజులలో మహాసైన్యముతో తిరిగివచ్చిన ఉలుఘ్ ఖాన్ తో తలబడిన ప్రతాపరుద్రుని సేనలు వీరోచితముగా పోరాడినను పరాజయము తప్పలేదు. కాకతీయ నాయకులలో తలెత్తిన అనైక్యత, ఈర్ష్యాద్వేషాలు కూడా ఓటమికి కారణాలని చరిత్రకారుల అభిప్రాయం.

మరణం:
ప్రతాపరుద్రుడు, కటకపాలుడు గన్నమ నాయుడు మరియూ పెక్కు సేనానులు బందీలయ్యారు. ప్రతాపరుద్రున్ని బంధించిన ఉలుఘ్‌ఖాన్, వరంగల్ లోనే ఉంచితే ప్రమాదమని విశ్వాసపాత్రులైన ఖాదిర్ ఖాన్, ఖ్వాజాహాజీలకు ఆయన్ను ఢిల్లీకి తరలించే బాధ్యతను అప్పగించాడు. అయితే ప్రతాపరుద్రుడు మార్గమధ్యంలోనే కన్నుమూశాడు. అయితే ఇవన్నీ గ్రంథస్తం చేసిన షాంసి సిరాజ్ అఫీఫ్ ప్రతాపరుద్రుడు ఎలా మరణించాడో వివరించలేదు. సుల్తాను సైన్యం ప్రతాపరుద్రుని ఢిల్లీ తీసుకు వెళుతుండగా మార్గమధ్యాన సోమోద్భవ (నర్మదా నది) తీరంలో ఆయన కన్నుమూశాడని ముసునూరి ప్రోలయ నాయకుని క్రీ.శ. 1330 విలసదానపత్రం పేర్కొంది.ప్రతాపరుద్రుడు సహజ మరణం చెందలేదని స్వఛ్ఛందంగానే భగవదైక్యం చెందాడని క్రీ.శ. 1423లో రెడ్డిరాణి వేయించిన అనితల్లి కలువచేరు తామ్రశాసనంలో ఉంది. దీనిని బట్టి ప్రతాపరుద్రుడు ఆత్మహత్య చేసుకోవటమో లేదా అతని కోరిక మేరకు సహచరులెవరైనా చంపటమో జరిగివుంటుందని భావిస్తున్నారు.

సాంస్కృతిక వారసత్వం:
ప్రతాప రుద్రుని వీరగాథ తెలుగు సాహిత్యంలో ఎన్నో విధాలుగా కీర్తింపబడింది.

శాసనాలు:
ఢిల్లీ పాలకులు ఓరుగల్లును ఆక్రమించుకున్న తర్వాతి కాలంలో వారితో పోరాడి ఆంధ్రదేశంలోని వివిధ ప్రాంతాలను తిరిగి ఆక్రమైంచిన పలువురు రాజులు, వారి సేనానులు తమ శాసనాలలో ప్రతాప రుద్రుని వీరగాథను ప్రశంసించారు. తీరాంధ్రను పరిపాలించిన మునుసూరి నాయకులు, రెడ్డి రాజులు వేయించిన పలు శాసనాలలో కాకతీయ సామ్రాజ్య పతనానికి సంబంధించిన విషాదం, కాపాడుకునేందుకు ప్రతాప రుద్రుడు చేసిన వీరోచిత పోరాటాలు వంటీవి ప్రస్తావనకు వచ్చాయి.

కాల్పనిక సాహిత్యం:
నాటకాలు, కావ్యాలు, చారిత్రిక నవలలు వంటి వాటిలో ప్రతాప రుద్రుని గురించి ఎన్నో ప్రస్తావనలు రావడమే కాక కొన్ని రచనల్లో ప్రతాప రుద్రుని పోరాటాలు, వీరత్వం, దురదృష్టకరమైన ఓటమి, మరణం వంటివే ఇతివృత్తాలు. వీటిలో కొన్ని చారిత్రికపరమైన వివరాలను కాకుండా కాల్పనికాంశాలకు పెద్దపీట వేసినవీ ఉన్నాయి.

ప్రతాపరుద్రీయం: 
కాకతీయ సామ్రాజ్యపు ఆఖరి చక్రవర్తి ప్రతాప రుద్రుని జీవితంలో కొన్ని జరిగిన ఘటనలు ఆధారంగా చేసుకుని ప్రముఖ పండితుడు వేదము వేంకటరాయ శాస్త్రి రచించిన నాటకం ఇది. ఈ నాటకంలోని ఇతివృత్తం ప్రకారం ప్రతాపరుద్రుని మంత్రి యుగంధరుడు. ఇతడు మహామేధావి, గొప్ప రాజభక్తి కలవాడు. ఢిల్లీ సుల్తాన్ తుగ్లక్, సేనాధిపతి వలీఖాన్. అతడు ఒకనాడు ఓరుగల్లు వచ్చి, తమ సుల్తానుకు కాబూల్ సుల్తానుకు మధ్య యుద్ధం జరగబోతోందనీ, దానికి ప్రతాపరుద్రుని సహాయం అర్థించడానికి వచ్చామనీ చెబుతాడు. కాని అతడు ప్రతాపరుద్రున్ని ఎలాగైనా కుట్రతో నిర్భంధించి, ఢిల్లీకి పట్టుకుపోవాలనే పన్నాగంతో వస్తాడు. అప్పుడు మంత్రులు, రాజు నగరంలో లేడని, ఒక వారంలో వస్తాడని చెబుతారు. ఇంతలో వలీఖాన్ తన రహస్య అనుచరులతో, వేటకు వెళ్ళిన ప్రతాపరుద్రుని బంధించి,ఢిల్లీ సుల్తాన్ వద్దకు తీసుకొనిపోతాడు. విషయాన్ని వేగుల ద్వారా తెలుసుకొన్న మంత్రి యుగంధరుడు, పేరిగాడనే వానికి మారువేషం వేయించి, ప్రతాపరుద్రుని స్థానంలో, ఢిల్లీ సుల్తాన్ రాజదర్బారులో ప్రవేశపెట్టి, వలీఖాన్ ఆట కట్టించి, ఢిల్లీ సుల్తాన్ ద్వారా అతనికి శిక్ష వేయించి, నాటకాన్ని రక్తి కట్టిస్తాడు. అలా తన అచంచలమైన రాజభక్తిని చాటుకొంటాడు మంత్రి యుగంధరుడు. ఈ కథకూ చారిత్రిక యధార్థాలకు పొంతన లేకున్నా పాత్రలు చాలా వరకూ చారిత్రికాలే.


కాకతీయుల సామంతులు:

కాకతీయుల కాలమున సామంతులు, మహా సామంతాధిపతులు, మహా మాత్యులు, దండనాయకులు అమేయమైన శక్తిప్రపత్తులతో, రాజ భక్తితో, దేశ భక్తితో చాలా చక్కని పాత్రని పోషించినారు. యుద్ధములలో వీరు చాలా ఎన్న దగిన పాత్ర పోషించినారు. అటువంటి కాకతి వంశ సామంతులలో ఎన్నదగినవారు:

1. కందూరి చోడులు
2. రేచర్ల రెడ్డి వంశీయులు
3. చెరకు రెడ్డి వంశీయులు
4. మల్యాల
5.విరియాల
6.వావిలాల
7. త్యాగి
8.నతవాడి
9.కోట
10.కాయస్థ
11.ఇందులూరి
12.గోన
13.రేచర్ల పద్మనాయక



No comments:

Post a Comment